Saturday, April 27, 2024

తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల

  • జనజాతర సభ ఏర్పాట్లను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పరిశీలించారు
  • బిఆర్‌ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు

తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తాము తుక్కుగూడ నుంచే ఆరు గ్యారంటీలు ప్రకటించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీలను తూ.చా తప్పకుండా అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన గంటలోనే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని భట్టి కోరారు. ఈనెల 06వ తేదీన జరుగనున్న జనజాతర సభ ఏర్పాట్లను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. ప్రధాన వేదిక, సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

గత పాపాలకు బిఆర్‌ఎస్‌దే బాధ్యత
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రం మన అందరిదని స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. అవాస్తవాలు మాట్లాడే బిఆర్‌ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని, పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత విషయాలు….
విపక్ష నేతలను టార్గెట్ చేసి బిఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడటం దారుణమన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్‌మెంట్‌లను వాడుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి పౌరుడి హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని, దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని, వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకున్నారన్నారు. జరిగిన నష్టానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

జూన్‌లో వచ్చిన వర్షాలను కెసిఆర్ ఒడిసి పట్టలేదు
జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కెసిఆర్ ఒడిసి పట్టలేదని, అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందకు వదిలారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిర్మాణ లోపంతో కాళేశ్వరంలో గోదావరి నీటిని కిందికి వదలాల్సి వచ్చిందని, కెసిఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి, సంకల్పబలంతో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందోన్నారు. తెలంగాణ మోడల్‌గా తుక్కుగూడలో ఏఐసిసి నాయకత్వం సందేశం ఇవ్వబో తోందని, ఇది గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. తుక్కుగూడ సభనుంచే ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఇచ్చిన 6 గ్యారంటీలను దేశమే ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు. హామీల అమల్లో ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమే అని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
కెసిఆర్ మాదిరిగానే హామీలు అమలు చేయకుండా దిగిపోతారని అనుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా అడగకముందే రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను భారతదేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమలు చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దశాబ్ద కాలం పాటు కథలు చెప్పిందని, వీళ్లు కూడా అలాగే ఉంటారని అనుకోకుండా భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించామన్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఊహలకు అందని విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించామన్నారు. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి మొదలు హైదరాబాద్ సభ వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం మొత్తం లెక్కగట్టి చెక్కు రూపంలో అందజేశామన్నారు.

64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు
అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి కేవలం మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో నమోదు చేశామన్నారు. మీ మాదిరిగా 8 నెలలు తీసుకోలేదని లెక్కలు చెబితే బిఆర్‌ఎస్ నేతలు నోరు మూసుకున్నారు. రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్‌లోని థేమ్స నదిని మరిపించే ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టామని, ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే ఆ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నామన్నారు. ఫాంహౌస్ లో మూడు నెలలు పడుకొని బయటకు వచ్చి కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారని, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

బిఆర్‌ఎస్ పాలనలో కుప్పకూలిన డిస్కంలు, జెన్‌కోలు
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను బోగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిస్కంలు, జెన్‌కోలు మీ పాలనలో కుప్పకూలిపోయాయని, కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నామని ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు. 2030-, 31 వరకు పీక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. 30 వేల ఉద్యోగాలను మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని, అదనపు పోస్టులు కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాట వినిపిస్తే తాటతీస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్ నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని, ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular